ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 08:20 PM

తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ ఇళ్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. ఆగస్టు 15 నాటికి పెద్ద ఎత్తున గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. 360 డిగ్రీలో అభ్యర్థుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే.. అర్హులుగా తేలిన వారిని ఎంపిక చేసి వారికి ఇళ్లు కేటాయిస్తున్నారు. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చోట్ల అనర్హులకు ఇళ్లు మంజూరవుతున్నాయి. తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ వార్త సంచలనంగా మారింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారనే వార్తపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..


ఖమ్మం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారనే వార్త సంచలనంగా మారింది. ఖమ్మం 8వ డివిజన్‌ వైఎస్సార్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ తొలి విడతలో ఇళ్లు మంజూరైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా లాభం లేదని.. అధికారులు దీనిపై స్పందిచడం లేదని.. తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎవరైనా దీనిపై స్పందించి విచారణ చేపట్టాలని.. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు 1950 మందికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1,950 మంది అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. దీంతో అధికారుల వారి ఇళ్లను రద్దు చేశారు. మరోవైపు శాఖపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. వీరందరికి గతంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని.. అప్పుడు నిర్మాణం చేపట్టలేదని అధికారులు తెలిపారు. తొలి విడత రూ.లక్ష చెల్లించే సమయంలో వీరి గురించి తెలిసిందని.. అందుకే వెంటనే వీరికి కేటాయించిన ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడు ఒకే కుటుంబంలోమ 5గురు ఇందిరమ్మ ఇళ్లను పొందారన్న దానిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa