తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. శనివారం.. ఆయన హైదరాబాద్లోని పలు ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. మైత్రివనం, బల్కంపేట, అమీర్పేటలోని గంగుబాయి బస్తీ వంటి ప్రాంతాల్లో నీట మునిగిన కాలనీలను సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మాదాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. నగరంలో కారు మబ్బులు కమ్ముకోవడంతో మరో భారీ వర్షం పడటం ఖాయమని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో గంటలో హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడవచ్చని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక్క హైదరాబాద్లోనే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నలు నాట్లు వేసే పనుల్లో ఉండగా.. ఇబ్బందులకు గురవుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్న నేపథ్యంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల విషయానికి వస్తే.. ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa