ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. పురుషులకు బంపర్ ఆఫర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 08:13 PM

రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెరిగాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పురుష ప్రయాణికులు ఈ ఛార్జీల పెంపుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నుంచి 100 శాతం వరకు ఛార్జీలు పెంచారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగల వేళ ప్రజలు తమ సొంత ఊళ్లకు సురక్షితంగా, సులభంగా వెళ్లేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి కానీ.. ఇలా ఛార్జీలు పెంచి వారిపై భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు.


ఛార్జీల పెంపు వివరాలు..


వివిధ మార్గాల్లో పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ మార్గాల్లో పెంచిన ఛార్జీల గురించి పోస్టులు పెడుతున్నారు. వాటిలో..


నాగర్‌కర్నూల్ నుండి హైదరాబాద్‌కు సాధారణ ఛార్జీ రూ.100 ఉన్నప్పుడు.. ఇప్పుడు అది పెరిగింది. నల్గొండ నుండి మిర్యాలగూడకు సాధారణంగా రూ.60 ఉండే ఛార్జీని రూ.120కి పెంచారు. ఎల్బీ నగర్ నుండి సూర్యాపేటకు రూ.200 ఉండే ఛార్జీని రూ.310కి పెంచారు. జేబీఎస్ నుండి కామారెడ్డికి ఛార్జీ రూ.240 నుండి రూ.340కి పెరిగింది.


ఈ ధరల పెరుగుదలపై ఒక ప్రయాణికుడు కండక్టర్‌ను అడగగా.. ‘పండుగ సందర్భంగా ప్రభుత్వం రేట్లు పెంచింది’ అని జవాబు రావడంతో ఆశ్చర్యపోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, దాని భారాన్ని పురుషులపై మోపుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాఖీ పండుగ రోజున సోదరీమణులకు సోదరులు బహుమతులు ఇస్తే.. ప్రభుత్వం మాత్రం పురుష ప్రయాణికులకు ఛార్జీల భారం బహుమతిగా ఇచ్చిందని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. చికెన్ ధరలు లాగా ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.


ఈ సమస్యపై ప్రభుత్వం.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇలా పండుగ వేళ ప్రజలపై భారం వేయకుండా చూడాలని నెటిజన్లతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే పెంచిన ఛార్జీలు కేవలం అదనపు బస్సు సర్వీసుల్లో మాత్రమే వసూలు చేస్తున్నామని.. రెగ్యులర్‌గా తిరిగే బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఆ బస్సుల్లో కూడా పెంచిన ఛార్జీలు ఆగస్టు 11 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని తెలియజేశారు. ప్రయాణికులకు అసౌర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ యాజమాన్యం చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa