ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్లపల్లి నుంచి వెళ్లే ఆ ట్రైన్ కొత్త తేదీలు ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 07:48 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా.. కొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. ఈ క్రమంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. చర్లపల్లి, నాందేడ్ మధ్య నడిచే కొన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పొడిగింపుతో పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని ఎదుర్కోవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.


రైళ్ల పొడిగింపు వివరాలు..


చర్లపల్లి-కాకినాడ టౌన్ (07031) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 2వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. అంటే ఆగస్టు 15, ఆగస్టు 22 శుక్రవారాల్లో ఈ ట్రైన్ నడుస్తుంది. కాకినాడ టౌన్-చర్లపల్లి (07032) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. అంటే ఆగస్టు 17, 24, 31 తేదీల్లో ఈ ట్రైన్ సర్వీస్ నడుస్తుంది. నాందేడ్-తిరుపతి (07015) ప్రత్యేక రైలు 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. తిరుపతి-నాందేడ్ (07016) ప్రత్యేక రైలు 2026 మార్చి 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.


ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారాలు..


అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ పనుల కారణంగా, కొన్ని రైళ్లను నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి వంటి స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. ఈ తాత్కాలిక మార్పు వల్ల ప్రయాణికులు ముఖ్యంగా చర్లపల్లికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్లపల్లి స్టేషన్‌కు సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు లేకపోవడం, ఆటోలు, క్యాబ్‌లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావడం వంటి సమస్యలు ప్రయాణికులను వేధిస్తున్నాయి. రైలు టికెట్ ధర కంటే స్టేషన్‌కు చేరుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సమస్యలను తగ్గించడానికి.. అధికారులు చర్లపల్లి స్టేషన్‌కు బస్సు సౌకర్యాలను పెంచాలని.. ఆటోలకు, క్యాబ్‌లకు ఒక నిర్దిష్టమైన ఛార్జీలను నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో పనులు త్వరలో పూర్తవుతాయని, ఆ తర్వాత కొన్ని రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు హామీ ఇస్తున్నారు. ఈ లోపు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa