ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్, దుర్గా మండపాలకు తెలంగాణ సర్కార్ ఉచిత విద్యుత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 06:15 AM

తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితి, దసరా పండగల సందర్భంగా మండపాల నిర్వాహకులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్, దుర్గా దేవి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉత్సవ కమిటీలకు లబ్ధి చేకూరనుంది.ఈ మేరకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ  అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే వినాయక నవరాత్రులకు, అలాగే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే దుర్గా నవరాత్రులకు ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన నిర్వాహకులందరికీ ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.మరోవైపు, పండగలను శాంతియుతంగా, భద్రత నడుమ జరిపేందుకు తెలంగాణ పోలీసులు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో పాటు విద్యుత్ శాఖ అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. మండపాల ఏర్పాటులో నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్లను పూర్తిగా మూసివేయరాదని పోలీసులు ఆదేశించారు. రాత్రి 10 గంటల తర్వాత మైకుల వాడకంపై నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తేల్చి చెప్పారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా, గణేష్ ఉత్సవ నిర్వాహకులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. డీజేలు, బాణసంచా కాల్చడం వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. భక్తులు పండగను ప్రశాంతంగా, ఘనంగా జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు. నిమజ్జన యాత్రలను వీలైనంత త్వరగా ప్రారంభించి, పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa