ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్..ఈ నెల 19న రోడ్ షో,,,?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 06:38 PM

జూబ్లీహిల్స్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా.. అభ్యర్థిని ప్రకటించి తామేం తక్కువకాదంటోంది. అయితే అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్‌ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. మంగళవారం (అక్టోబర్ 14) తమ అభ్యర్థికి.. కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఈ క్రమంలో అధైర్య పడొద్దని సునీతా గోపీనాథ్‌కు.. కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. తాను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.


జూబ్లీహిల్స్ రోడ్డు షోలో..


ఈ ఏడాది ఏప్రిల్‌లో వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు కేసీఆర్ వచ్చారు. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే ఆ తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలో కనిపించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్ల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్న కేసీఆర్.. ఈ నెల 19 జూబ్లీహిల్స్‌లో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రోడ్డు షోలో పాల్గొనే విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కాగా, కేసీఆర్ ఒక్కసారి వస్తే చాలు అన్న భావనలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ వస్తారా.. లేక ఈ ఎన్నికలను కేటీఆర్, హరీశ్ రావు ప్రచారంతో సరిపెడతారా అనేది వేచి చూడాలి.


అనేక సమీకరణాల తర్వాత కాంగ్రెస్ పార్టీ.. సీనియర్లను పక్కన పెట్టి నవీన్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. ఆయనకు మజ్లిస్ మద్దకు కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. పలుమార్లు ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం కూడా నవీన్ యాదవ్‌కు ఉండటంతో.. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెట్టాలి. కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే.. ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa