ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకు ఖాతాల విషయంలో గందరగోళం నెలకొని.. నిధులు జమ కావడం లేదు. సాంకేతిక సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్లో నమోదు చేసిన బ్యాంకు ఖాతాల్లో కాకుండా, ఈ-కేవైసీ పూర్తయిన బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు జమ అవుతుండటంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. కొందరు లబ్ధిదారులు ఈ ఖాతాలను వినియోగించడం లేదు. మరి కొన్ని అకౌంట్ల విషయానికి వస్తే.. బ్యాంకుల్లో తీసుకున్న లోన్ల కారణంగా.. అధికారులు వాటిని హోల్డ్లో పెట్టడంతో డబ్బులు లబ్ధిదారులు చేతికి అందడం లేదు. ఈ సమస్యల వల్ల ఇళ్లు కట్టుకుంటున్నవారు, ఇతర పథకాల లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. సర్కార్ నుంచి వచ్చే ఈ డబ్బులు.. లబ్ధిదారులు యాప్లో నమోదు చేసిన బ్యాంకు ఖాతాల్లోనే జమ కావాలి. అయితే ఇటీవల ప్రభుత్వం.. నగదు జమకు సంబంధించి కొత్త రూల్స్ అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ కేవైసీ పూర్తయిన ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తూ వస్తోంది. ఫలితంగా పథకం ప్రారంభంలో లబ్ధిదారులు యాప్లో ఇచ్చిన అకౌంట్లలో డబ్బులు జమ అవ్వడం లేదు. పైగా లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానమైన వేరే ఈ-కేవైసీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇది లబ్ధిదారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఈ విషయానికి వస్తే కాసిపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన ఇందిరమ్మ అనే లబ్ధిదారులు.. స్లాబ్ వరకు ఇంటిని నిర్మించింది. దీంతో గవర్నమెంట్ నుంచి రావాల్సిన మూడో బిల్లు రూ.2 లక్షల కోసం పంచాయతీ కార్యదర్శి, ఏఈ ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేశారు. అయితే టెక్నికల్ సమస్యల వల్ల ఇందిరమ్మ ఖాతాలో రూ.4 లక్షలు జమ అయినట్లు మొబైల్కు మెసేజ్ వచ్చింది. అధికారులు అప్రమత్తమై, ఆ ఖాతాను హోల్డ్లో పెట్టి, అదనంగా జమ అయిన రూ.2 లక్షలను ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయించుకున్నారు.
అదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారురాలికి ముత్యంపల్లి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. దీన్నే ఆమె ఇందిరమ్మ యాప్లో నమోదు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె మహిళా సంఘంలో అప్పు చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఆ ఖాతాను హోల్డ్లో పెట్టారు. దీంతో ఆమె ఖాతా సరిగా లేదని మొబైల్కు సమాచారం వచ్చింది. ఆమె మళ్లీ బ్యాంకుకు వెళ్లి ఖాతాను హోల్డ్ నుంచి తీయించుకోవాల్సి వచ్చింది.
కాసింపేట మండంల, కోమటిచేనుకు చెందిన మరో లబ్ధిదారుడు నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణాన్ని బేస్మెంట్ వరకు పూర్తి చేశాడు. అయితే పనులు మొదలు పెట్టే ముందు.. మత్యంపల్లి గ్రామీణ బ్యాంకు ఖాతాను నమోదు చేసుకున్నాడు. కానీ ఆ అకౌంట్కు ఈ-కేవైసీ చేయించలేదు. దీంతో డబ్బులు జమ కాలేదు. దీని గురించి బ్యాంకు అధికారులను అడిగితే సమస్య ఏంటో తెలిపారు. అప్పుడు సదరు లబ్ధిదారు తనకున్న పోస్టాఫీసు ఖాతాకు ఈ-కేవైసీ ఉందని చెప్పాడు. కానీ, ఆ ఖాతాలో డబ్బులు జమ అయ్యే పరిమితి తక్కువగా ఉంది. చివరకు చేసేదేంలేక.. వేరే బ్యాంకులో కొత్త ఖాతా తెరవాల్సి వచ్చింది. ఇలా చాలా మంది లబ్ధిదారులు ఈకేవైసీ, ఇతర సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa