ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ కడుపున పుట్టడం నా అదృష్టం, కానీ..కవిత కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 06:51 PM

తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ రోజురోజుకూ తీవ్ర ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. త్వరలోనే తాను చేపట్టనున్న ప్రజాయాత్రకు సంబంధించిన పలు వివరాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ గురించి మాట్లాడిన కవిత.. ఒక పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అని.. ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని యాత్ర చేయడం నైతికంగా సరైంది కాదని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ఫోటో కాకుండా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తన తండ్రి అని.. ఆయన కడుపున పుట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. అదే సమయంలో కేసీఆర్ ఫోటోను యాత్రలో ఉంచడం తన నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.


మరోవైపు.. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతిపై స్పందించిన కవిత.. జాగృతి ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ ఆలోచనలు లేకుండానే ప్రారంభించామని తేల్చి చెప్పారు. తాను బీఆర్ఎస్‌లో చేరినపుడు మాత్రమే కేసీఆర్ ఫోటోను ఉంచానని.. తెలిపారు. భౌగోళిక తెలంగాణను సాధించాం కానీ.. ఇంకా సామాజిక తెలంగాణ సాధించలేదని తాను చెప్పానని.. ఆ మాటల కారణంగానే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని కవిత ఆరోపించారు.


సామాజిక తెలంగాణ కోసం తాను అప్పుడు పోరాడానని.. ఇప్పుడు కూడా పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలే తన గురువులని.. అందుకే ప్రజల దగ్గరికి వెళ్లాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు కవిత వివరించారు. హైదరాబాద్‌లో కూర్చొని జిల్లాల్లో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడటం సరైంది కాదని.. అందుకే ప్రతీ జిల్లాలో జాగృతి జనం బాట పేరుతో 2 రోజులపాటు యాత్ర చేస్తానని తెలిపారు. నాలుగు నెలలపాటు ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని కవిత వివరించారు. యాత్రలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. వారికి అన్నీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామని వెల్లడించారు.


మరోవైపు.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సానుకూలంగా లేదని విమర్శలు చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి.. ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని కవిత ఆరోపించారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa