ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి ఖాతాల్లో రూ.2,095.10 కోట్లు.. డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 07:00 PM

బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.2,095.10 కోట్లు నిలిచి పోయాయని అధికకారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలు సుమారు 78,53,607 ఖాతలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. అయితే ఇంత మొత్తంలో నగదు నిలిచిపోవడానికి ప్రధాన కారణం.. ఈ బ్యాంకు ఖాతాల గురించి సదరు సభ్యులు మరిచిపోయి ఉంటారు. మరి కొందరు చనిపోయి ఉంటారు. ఇలా మరణించిన వారి బ్యాంకు ఖాతాలు నగదు గురించి కుటుంబ సభ్యులకు తెలియకపోవడం.. అలానే చాలామంది తమ ఆర్థిక విషయాలను ఎవరికి చెప్పకపోవడం వంటి కారణాల వల్ల ఈ డబ్బులు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.


ఆగస్టు 31, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో కలిపి 78 లక్షలకు పైగా ఖాతాల్లో సుమారు 2,100 కోట్ల రూపాయలు మిగిలి పోయి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పది సంవత్సరాలకు పైగా లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లోని డబ్బును.. డిపాజిటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ నేపథ్యంలో, బ్యాంకులు ఈ మొత్తం గురించి అక్టోబర్ నెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహించి ప్రజలకు దీని గురించి అవగాహన కల్పిస్తున్నాయి.


  రాష్ట్రంలోని 30 బ్యాంకుల్లో గత పది సంవత్సరాలుగా లావాదేవీలు నిర్వహించని ఇలాంటి ఖాతాలు ఉండగా.. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే అత్యధికంగా 21,61,529 ఖాతాల్లో రూ.586.98 కోట్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20,70,208 ఖాతాల్లో రూ.467.76 కోట్లు నిలిచిపోయాయని అధికారులు చెప్పుకొచ్చారు. అలానే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ అన్‌క్లెయిమ్డ్‌ డబ్బు ఎక్కువగా పేరుకుపోయిందని చెప్పుకొచ్చారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వారి బ్యాంకు ఖాతాలో నగదు ఉందని తెలిస్తే.. అప్పుడు కుటుంబ సభ్యులు.. ఉద్గం పోర్టల్ ద్వారా వివరాలు చెక్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా


ఈ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.


ఆ తర్వాత చనిపోయిన, లేదా ఎవరి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామో వారి వివరాలు నమోదు చేయాలి.


అడిగిన సమాచారం ఇచ్చాక.. సదరు వ్యక్తి ఖాతాలోని నగదు నిల్వ వివరాలు తెలుస్తాయి.


బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఉంటే.. చనిపోయిన వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటే.. ఇతర పత్రాలను బ్యాంకులో ఇచ్చి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.


ఒకవేళ ఖాతాదారుడు డబ్బు జమ చేసి మర్చిపోతే, వారి ధ్రువీకరణ పత్రాలు, KYC పత్రాలతో బ్యాంకును సంప్రదించాలి.


ఈ వివరాలన్నింటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత బ్యాంకు డబ్బును తిరిగి అప్పగిస్తుంది.


వినియోగదారులు డిసెంబర్ 31 లోపు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోకపోతే, ఆ డబ్బు DEAF లో జమ అవుతుందని తెలిపారు అధికారులు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa