తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాంగ్రెస్ నాయకులు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ఈరోజు (మ.12.15 గంటలకు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేబినెట్ విస్తరణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలక పరిణామంగా చెప్పవచ్చు. అజారుద్దీన్ చేరికతో కేబినెట్ బలం మరింత పెరగనుంది.
అజారుద్దీన్ తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ కొనసాగే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. త్వరలోనే మరో ఇద్దరు నాయకులకు కూడా క్యాబినెట్లో అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్ఠానం ఈ విషయంలో త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. కేబినెట్లో ఇంకా ఖాళీలు ఉండటంతో, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతిపదికన ఈ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇదే సందర్భంలో, రాష్ట్రంలో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేబినెట్ విస్తరణ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నప్పటికీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. మైనారిటీ నాయకుడికి మంత్రి పదవి దక్కకుండా అడ్డుకోవడం ద్వారా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
బీజేపీ వైఖరిని మరింత తప్పుబడుతూ మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి, పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక మైనారిటీ నేతకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకోవడానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కూడా ఈ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణపై బీజేపీ రాజకీయ విమర్శలు ఉపసంహరించుకోవాలని మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa