ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో కలుషిత రాజకీయ హింసకు ఏమాత్రం తావు లేదని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఒక సీనియర్ నాయకుడిపై జరిగిన ఈ దాడి, రాష్ట్రంలో రాజకీయాల ప్రమాణాలను దిగజారుస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దారుణ ఘటనకు పాల్పడిన దోషులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను 'వెంటాడి, వేటాడి' పట్టుకుని, చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు, రాజకీయ హింస పునరావృతం కాకుండా దోషులు అందరికీ గుణపాఠం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
సామినేని రామారావు హత్య నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీస్ అధికారుల పనితీరుపై డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ ఉన్నతాధికారులను ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోషులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
దోషులను త్వరగా పట్టుకునేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సైబర్ టీం వంటి ఆధునిక వనరులను సమర్థవంతంగా వినియోగించాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హత్యకు గల కారణాలను, దాని వెనుక ఉన్న కుట్ర కోణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. సామినేని రామారావు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, ఈ కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa