రాజకీయ వ్యూహకర్త కౌటిల్య కృష్ణుడు లేదా కేకే సర్వేస్ గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఆయన ఇచ్చిన ఎన్నికల ఫలితాల అంచనాలు పలు సందర్భాల్లో నిఖార్సైన విజయాన్ని సాధించగా.. మరికొన్ని చోట్ల విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన అంచనాల దాదాపు నిజమయ్యాయి.
ఏపీ ఎన్నికల్లో కేకే విజయం..
కేకే సర్వేస్కు విశ్వసనీయతను పెంచిన ముఖ్య ఘట్టాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం లభిస్తుందని.. ఆ పార్టీకి దాదాపు 150కి పైగా సీట్లు దక్కుతాయని ఆయన ముందే అంచనా వేయగలిగారు. ఆ సమయంలో ఇతర సర్వే సంస్థలు, విశ్లేషకులు ఇచ్చిన అంచనాలకు భిన్నంగా.. కేకే అంచనా వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం ఆయన సర్వే పద్ధతుల బలాన్ని నిరూపించింది. అంతే కాకుండా.. 2024 ఏపీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు వస్తాయని అందులో.. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. అనుకున్నట్లుగానే అతని అంచనా నిజమైంది. ఈ విజయం కారణంగానే తెలుగు రాజకీయ వర్గాల్లో కేకే సర్వేస్ పేరు బలంగా నాటుకుపోయింది.
జూబ్లీహిల్స్ సర్వే..
తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికపై కేకే సర్వేస్ ప్రకటించిన ఫలితాలు పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏకపక్ష విజయం సాధిస్తుందని కేకే ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయని తేల్చారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 37 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గతంలో వచ్చిన ఓట్లలో సగమే దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా.. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ.. ఆ ముస్లిం ఓటర్లు దానిని పట్టించుకోకుండా.. సగానికి పైగా ఓట్లను బీఆర్ఎస్ పక్షాన వేస్తున్నారని కేకే విశ్లేషించారు. జూబ్లీహిల్స్ వంటి హై-ప్రొఫైల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 55 శాతం ఓట్లు రావడం అసాధారణమైన అంచనాగా పరిగణించవచ్చు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ బలం.. నవీన్ యాదవ్ వంటి అభ్యర్థి వ్యక్తిగత బలం, మజ్లిస్ బహిరంగ మద్దతు వంటి అడ్వాంటేజ్లు కాంగ్రెస్ పక్షాన ఉన్నప్పటికీ.. కేకే వాటిని మైనస్ చేసి బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీని అంచనా వేశారు. బీజేపీ ఓటు బ్యాంకు సగానికి సగం తగ్గి.. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి ఇంత పెద్ద శాతం ఓట్లు రావడం నిజంగానే రిస్క్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫలితాలు ఏమాత్రం తేడా వస్తే.. కేకే సర్వేస్కు మార్కెట్లో ఉన్న విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే ఈ నియోజకవర్గ స్థాయి సర్వే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సర్వే తాను ఒక్క రోజులో చేసింది కాదని.. చాలా డివిజన్లలో చేసిన సర్వేగా కేకే చెప్పుకొచ్చారు.
డివిజన్ల వారీగా కేకే సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
నియోజకవర్గంలోని డివిజన్లవారీ సర్వే ఫలితాలతో కలిపి విశ్లేషించారు. కేకే సర్వే ప్రకారం.. కొన్ని డివిజన్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. మరికొన్నింటిలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బోరబండలో 63.2%, శ్రీనగర్ కాలనీలో 61.9%, ఎర్రగడ్డలో 61.6%, షేక్పేట్లో 60.1% ఓట్లతో 60 శాతం మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ డివిజన్లలోని ఓట్ల సమీకరణం వల్లే నియోజకవర్గం మొత్తంలో బీఆర్ఎస్కు 55 శాతం ఓట్ల అంచనా సాధ్యమైందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రహ్మత్నగర్లో 51.1 శాతం ఓట్లతో ముందంజలో ఉంటుందని అంచనా వేశారు. అలాగే.. వెంగళరావు నగర్లో 48.5 శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉంటుందన్నారు. యూసుఫ్ గూడాలో బీఆర్ఎస్ 47.1%తో స్వల్పంగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ 45.5 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇస్తుందన్నారు. మైనార్టీ ఓట్లు, అభ్యర్థి వ్యక్తిగత బలం కాంగ్రెస్కు ఈ ప్రాంతాల్లో ఉపయోగపడుతున్నట్లు సర్వే సూచిస్తోంది. బీజేపీ ఏ డివిజన్లోనూ 10 శాతం మార్కును అందుకోలేకపోయింది. దీని బట్టి చూస్తే.. బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు మళ్లినట్లుగా కేకే విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa