ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఏఎస్‌, ఐపీఎలకు నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 07:47 PM

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పరిపాలనకు మూల స్తంభాలుగా నిలుస్తారు. రాష్ట్రంలోని ప్రతి నిర్ణయం, ప్రతి ప్రజా కార్యక్రమం వీరి పర్యవేక్షణలోనే అమలవుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవులకు వెనుక ఉన్నది కేవలం అధికారం కాదు.. బాధ్యత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత. అయితే ఈ గౌరవానికి సరితూగేలా జీతం, అలవెన్సులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.


తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారిగా జీతం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.. ప్రారంభ దశలో ఒక ఐఏఎస్అధికారికి నెలవారీ మూల వేతనం రూ.56,100 ఉంటుంది. ఇది సివిల్ సర్వీస్‌లో అడుగు పెట్టిన కొత్త అధికారుల ప్రారంభ స్థాయి వేతనం. తెలంగాణలో మొదట వీరు సాధారణంగా అసిస్టెంట్ కలెక్టర్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పదవిలో పనిచేస్తారు. ఇది జిల్లాలోని ఒక సబ్-డివిజన్ పరిపాలనను నిర్వహించే కీలక స్థానం.


కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత.. వీరు జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదుగుతారు. కలెక్టర్‌గా పనిచేసే అధికారికి మూల వేతనం రూ.78,800 నుంచి రూ.1,18,500 వరకు ఉంటుంది. కలెక్టర్ స్థాయిలో అధికారికి వేతనంతో పాటు ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం , రవాణా భత్యం లభిస్తాయి. హైదరాబాద్, వరంగల్ పెద్ద నగరాల్లో ఇంటి అద్దె భత్యం మూల వేతనం 24 శాతం, మాధ్యమ పరిమాణ నగరాల్లో 16 శాతం, చిన్న పట్టణాల్లో 8 శాతం వరకు ఉంటుంది. అంటే, తెలంగాణలో హైదరాబాద్‌లో కలెక్టర్‌గా పనిచేస్తే.. ఒక ఐఏఎస్ అధికారికి మొత్తం జీతం దాదాపు రూ.1.5 లక్షల వరకు చేరుతుంది.


అధికారులు సీనియారిటీ పెంచుకుంటూ వెళ్తే.. వారు ప్రిన్సిపల్ సెక్రటరీ, చివరికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదుగుతారు. ఆ స్థాయిలో జీతం రూ.2,25,000 నుంచి రూ.2,50,000 వరకు ఉంటుంది. భారతదేశ కేబినెట్ సెక్రటరీ స్థాయికి చేరిన అధికారికి ఇంత జీతం ఉంటుంది. జీతంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. అధికారిక బంగ్లా, వాహనం, డ్రైవర్.. 24 గంటల భద్రతా సిబ్బంది.


వైద్య భత్యం, విద్యుత్, ఫోన్ బిల్లులు ప్రభుత్వమే భరిస్తుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఐపీఎస్ అధికారుల జీతం కూడా ఐఏఎస్‌లతో సమానంగానే ఉంటుంది. వీరి ప్రారంభ వేతనం కూడా రూ.56,100 నుంచే మొదలవుతుంది. అయితే అత్యున్నత స్థాయిలో ఐఏఎస్ అధికారుల కేబినెట్ సెక్రటరీ జీతం రూ.2,50,000 ఉండగా, ఐపీఎస్ అధికారుల DGP జీతం రూ. 2,25,000 వరకు ఉంటుంది.


ఒక ఐఏఎస్ అధికారి జిల్లా పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు.. అన్నీ వారి పరిధిలో ఉంటాయి. తెలంగాణలో వరదలు, వర్షాలు, కరువు పరిస్థితుల్లో ప్రభుత్వ చర్యలన్నీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. రాష్ట్ర సచివాలయంలో ఉన్న అధికారుల పాత్ర పాలసీ మేకింగ్ వైపు మారుతుంది. వీరు మంత్రులకు సలహాదారులుగా.. రాష్ట్ర పథకాల రూపకర్తలుగా వ్యవహరిస్తారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa