ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు.... త్వరలో ఆ కష్టాలకు చెక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:25 PM

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రతిష్టాత్మక 'అమృత్ భారత్ స్టేషన్' పథకంలో భాగంగా... ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపు సగం పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా ఈ ప్రాజెక్టు పురోగతిని వెల్లడించారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 714.73 కోట్లు వ్యయం చేస్తోంది. మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ఈ మహత్తర ప్రాజెక్టులో ఇప్పటివరకు 46 శాతం పనులు పూర్తయ్యాయి . ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.


ఈ ప్రాజెక్టు పూర్తయితే .. రైల్వే నెట్‌వర్క్ మరింత బలపడటంతో పాటు.. ప్రయాణికులకు అత్యాధునిక, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాకుండా.. ప్రస్తుతం అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడం.. దుమ్ము, ధూళితో స్టేషన్ కు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.


ఇక వాటికి త్వరలోనే చెక్ పెట్టే విధంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోనే ప్రముఖ రైల్వే కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా పాత నిర్మాణాలను మరమ్మతు చేయడమే కాకుండా.. సరికొత్త నిర్మాణాలను చేపట్టడం ద్వారా స్టేషన్‌ను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రైల్వే ప్లాట్‌ఫాం భవనం పూర్తయింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు వివరాలు ఇలా ఉన్నాయి.


సౌత్ బేస్‌మెంట్, సౌత్ మెయిన్ బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది స్టేషన్‌కు ప్రధాన ముఖద్వారంగా నిలవనుంది. బేస్‌మెంట్‌తో కూడిన నార్త్ మెయిన్ బిల్డింగ్, నార్త్ వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. ఇది వాహనాల పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించనుంది. ప్రయాణికులు సులభంగా ప్లాట్‌ఫాంలను చేరుకునేందుకు వీలుగా ఎయిర్ కాంకోర్స్ నిర్మాణం జరుగుతోంది.


అలాగే.. ప్లాట్‌ఫాంలపై కవర్ ఓవర్ ప్లాట్‌ఫాం ఏర్పాటు పనులు పూర్తయితే ఎండ, వర్షం నుండి ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది. కాజీపేట్ వైపు, హైదరాబాద్ వైపు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నారు. వీటితో పాటు.. స్టేషన్ వెంట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్-కమ్ ట్రావెలేటర్ ఏర్పాటు చేయడం అనేది ప్రయాణికుల సౌకర్యాన్ని మార్చనుంది. ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనతో సికింద్రాబాద్ స్టేషన్.. తెలంగాణకు ప్రవేశ ద్వారంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa