గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహార లోపాన్ని నివారించేందుకు, వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మొత్తం 3,253 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబరు 14వ తేదీన ఈ అల్పాహారం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, చిరుతిండ్లు, మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉదయాన్నే పనులకు వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిగా అల్పాహారం అందించలేకపోతున్నారు.
హైదరాబాద్లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు, అధికారులు కొద్ది నెలల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వివరించగా.. ఆమె గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అల్పాహారం అందించే ప్రతిపాదనకు తక్షణమే అంగీకరించారు. చిన్నారుల వయస్సును, పోషక విలువలను పరిగణలోకి తీసుకుని మెనూను రూపొందించారు. ఇందులో భాగంగా, చిన్నారులకు ఇడ్లీ, ఉప్మా, రాగిజావ, అటుకుల ఉప్మా వంటి ఆరోగ్యకరమైన, సులభంగా జీర్ణమయ్యే అల్పాహారాన్ని అందించనున్నారు.
ఒకవైపు అల్పాహారం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు కేంద్రాల నిర్వహణ సమస్యలపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 70 శాతానికి పైగా కేంద్రాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. ఆ గదిలోనే పిల్లలకు భోజనం వండటం, వడ్డించడం, వారికి పాలు, పౌష్టికాహారం నిల్వ చేయడం వంటివి చేయాల్సి వస్తోంది. దీంతో 20 మందికి పైగా చిన్నారులు ఉన్న కేంద్రాల్లో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
ఈ ఇబ్బందులను తొలగించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్న వనరుల్లోనే సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, పంజాగుట్ట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలల్లో తగినన్ని గదులు అందుబాటులో ఉంటే, ఆ పాఠశాలల ప్రాంగణంలోకి అంగన్వాడీ కేంద్రాలను మార్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇది చిన్నారులకు మెరుగైన వాతావరణాన్ని, పరిశుభ్రమైన స్థలాన్ని అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa