ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు మరో భారీ శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:05 PM

తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, వారిని మంత్రి సీతక్క పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో మహిళా సాధికారతకు సంబంధించిన ఒక కీలకమైన ప్రణాళికను ప్రకటించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలను అందించేందుకు ముందుకు వచ్చిందని ప్రకటించారు. మహిళా సంఘాలలో చేరిన ప్రతి మహిళకు ఉచితంగా రుణాలు ఇప్పించి.. వారి చేత చిన్న, మధ్య తరహా వ్యాపారాలను పెట్టించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు.


మహిళా సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో.. ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు అప్పగించామని సీతక్క తెలిపారు. దీని ద్వారా వారు రవాణా రంగంలో కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే వీలు కలుగుతుంది. మహిళా గ్రూపుల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుల, మత, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయకుండా, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


జూబ్లీహిల్స్‌లో గతంలో మూడుసార్లు బీఆర్‌ఎస్‌కు గెలుపునిచ్చినా.. ఆ ప్రాంతంలో సరిగా అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. స్థానికుడు, పక్కా లోకల్ నాయకుడు అయిన నవీన్ యాదవ్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని.. ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకు ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని సీతక్క తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కానీ తాము రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు.


కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని గుర్తు చేస్తూ.. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. ఈ రిజర్వేషన్ల వల్లే ఎంతోమంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని, ఉద్యోగాలు పొందారని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా మైనార్టీలకు కోటా కల్పించామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 4 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు. చివరగా.. ప్రతి వర్గం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనే నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa