ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీతో పాటే తెలంగాణలో కూడా..‘ఈ సారి ఎలక్షన్స్ 2028లో కాదు.. 2029 జూన్‌లో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:09 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా రాబోయే ఎన్నికల భవిష్యత్తుపై సంచలన జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికల ప్రస్తావనను తోసిపుచ్చారు. రేపు జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. తన మాటలను గమనించాలని కోరుతూ.. 2028లో కాకుండా 2029 జూన్ నెలలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంటే ఏపీతో పాటే.. తెలంగాణలో కూడా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అక్కడితో ఆగకుండా.. 2029 నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.. అంటే 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


ప్రజలు గతంలో టీడీపీకి, కాంగ్రెస్‌కి, చంద్రశేఖర్ రావుకి చెరో 10 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారని.. అదే విధంగా మళ్లీ పదేళ్లు మాకే అధికారాన్ని ఇస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల కాలంలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని రచిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలకు వారి హయాంలో విశేష ప్రాధాన్యం లభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాది నేటి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులు నగరానికి జీవనాడిలా మారాయని వివరించారు.


కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తీసుకున్న ముందస్తు నిర్ణయాల కారణంగానే హైదరాబాద్ నగరం 'నాలెడ్జ్ సిటీ'గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2004-2014 మధ్య అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం వల్ల దేశానికి వచ్చిన కేంద్ర సంస్థల్లో 70 శాతం హైదరాబాద్‌కే వచ్చాయని తెలిపారు. నేడు జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా ఎదగడానికి ఆ నాటి కాంగ్రెస్ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు.


మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పాలనా కాలాన్ని 500 రోజులు అని అంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. 2025 డిసెంబర్ వస్తేనే రెండేళ్లు అవుతుందని.. ఆ లెక్కన సుమారు 1000 రోజుల పైనే తమ పాలన ఉంటుందని చెప్పారు. ‘ఆయన లెక్కలు ఎలా వేస్తున్నారో, అమెరికా-ఇండియా కాలిక్యులేషన్స్ ఏమైనా వాడుతున్నారో, లేకపోతే మేలుకొని ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నారో నాకు తెలియదు’ అంటూ చమత్కరించారు.


2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధిని ఆపకుండా.. దాని కొనసాగింపే.. 2024 నుంచి 2034 వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మాటల ద్వారా తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల మంచిని తీసుకుంటూ.. దూరదృష్టితో పాలన అందిస్తుందని ప్రజలకు సందేశం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa