ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 08:59 PM

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు విమర్శలతో వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి రేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై దృష్టి సారించడం ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు.


నిన్నటిదాకా భట్టి విక్రమార్క మాత్రమే సీఎం రేసులో ఉండేవారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ పోటీలో ఉన్నారని జగదీశ్ రెడ్డి అనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం అంతర్గతంగా పోరాటం జరుగుతుందనే విషయాన్ని జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా బహిరంగంగా ప్రకటించారు.


రేవంత్ రెడ్డి దగ్గరివాళ్లు చెప్పినా వినే పరిస్థితిలో లేరని.. ప్రశ్నిస్తే ‘పాలన మీరే చేయండి’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాలని, ఆయన కంటే ఎవరైనా బాగానే పాలన చేస్తారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌ను 'పబ్'లా కనిపిస్తోందని విమర్శించి.. స్టార్ హోటల్‌లో 'మీట్ ది ప్రెస్' పెట్టడంపై జగదీశ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలకు తిరిగినట్లు జూబ్లీహిల్స్ సందుసందుకు తిరుగుతున్నారని విమర్శించారు.


రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనల్లో.. రూ. 3 వేల కోట్లతో ఉస్మానియా అభివృద్ధి, 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, ఆర్టీసీకి రూ. 7 వేల కోట్ల లాభం, 60 వేల ఉద్యోగాలు.. అన్నీ అబద్ధాలే అని జగదీశ్ రెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ధర్నాలు చేస్తే కేసులు పెట్టి జైళ్లపాలు చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగులు నామినేషన్లు వేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రచారం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు.


రేవంత్ రెడ్డి ‘కమాండ్ కంట్రోల్, కాళేశ్వరం’ కడితే ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించడంపై..‘నీ నౌకరే (ఉద్యోగి) అందులో చేస్తున్నావు కదా’ అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ .. పీజేఆర్ కుటుంబానికి రాజకీయాల్లో స్థానం లేకుండా చేసింది నువ్వు అని రేవంత్ రెడ్డిని విమర్శించారు. ‘ఇంత ప్రేమ ఉంటే, ఆ కుటుంబానికి సీటు ఎందుకు ఇవ్వలేదు.. అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 'మా చంద్రబాబు, మా వైఎస్సార్' అని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని.. 2004 నుంచి 2014 వరకు స్వర్ణయుగం అన్నప్పుడు.. ఆకలిచావులు మీ జిల్లాల్లో కూడా ఉన్నాయని జగదీశ్ రెడ్డి తిప్పికొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa