ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇలా.. ఏకంగా 17,960 ఉద్యోగాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 07:25 PM

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పర్యాటక రంగంలో అంతర్జాతీయ గమ్యస్థానంగా రూపుదిద్దుకోబోతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టూరిజం రంగంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. దేశీయ, అంతర్జాతీయ డెవలపర్ల నుంచి రూ. 13,819 కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా 17,960 మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త బాటలు పడుతున్నాయి.


ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే 14 ప్రాజెక్టులకు గాను రూ. 7,081 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా సుమారు 8,920 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే.. పూర్తిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో 17 ప్రాజెక్టులు చేపట్టేందుకు డెవలపర్లు ముందుకు రాగా.. రూ. 6,738 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 9,040 ఉద్యోగాలు కల్పించనున్నారు. హైదరాబాద్‌తో పాటు వికారాబాద్, నాగార్జున సాగర్, బుద్ధవనం, అమరగిరి, సోమశిల, అమ్రాబాద్ తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ పెట్టుబడులు కేంద్రీకృతమవుతున్నాయి.


ఇక్కడ ఎకో, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ట్రెక్కింగ్, సఫారీ, ఫారెస్ట్ రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనంతగిరి హిల్స్‌లో 81 ఎకరాల్లో రూ. 1,021 కోట్లతో లగ్జరీ 'లా వీ వెల్‌నెస్ రిట్రీట్'ను నిర్మిస్తున్నది. బుద్ధవనంలో వెడ్డింగ్, వెల్‌నెస్ సెంటర్లు అభివృద్ధి చేస్తున్నారు. మహాబోధి సొసైటీ, థైవాన్ ఫోగువాంగ్ షాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ బుద్ధిస్ట్ మిషనరీ మెడిటేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నాయి. కృష్ణా నది బ్యాక్‌వాటర్‌లోని సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్స్ , అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.


రామోజీ గ్రూప్ రామోజీ ఫిల్మ్ సిటీలో 600 ఎకరాల్లో కొత్త టూరిజం ఆకర్షణల కోసం రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నది. సినిమా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, మాస్టా స్టూడియోస్ రూ. 550 కోట్లతో 'బాహుబలి థీమ్ పార్క్‌ను' నిర్మించనున్నది. హైదరాబాద్ నగరం కూడా లగ్జరీ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల హబ్‌గా మారుతోంది. ప్రెస్టీజ్ గ్రూప్ రాయదుర్గంలో ఒబెరాయ్‌తో 5-స్టార్ హోటల్ , బుద్వెల్‌లో సెయింట్ రెజిస్ హోటల్ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లతో ప్రాజెక్టులు చేపడుతున్నది. శంషాబాద్‌లో సిటాడెల్ హోటల్స్ రూ. 500 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తుండగా.. నియోపోలీస్‌లో బ్రిగేడ్ గ్రూప్ ద్వారా ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ రాబోతోంది. ఈ భారీ పెట్టుబడులతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరడమే కాకుండా.. రాష్ట్రం పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో కీలక స్థానం సంపాదించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa