జీవితంలో పైకి రావాలన్నా.. బాగా సంపాదించాలన్నా.. వ్యాపారమే సరైన మార్గమని చెబుతుంటారు. అయితే ఏ వ్యాపారమైనా.. కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతూ లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ లిక్కర్ వ్యాపారం అలా కాదు. లక్కుండాలే కానీ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన లాటరీ ప్రక్రియ కొందరు అదృష్టవంతులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేవలం రూ. 3 లక్షల నాన్-రిఫండబుల్ రుసుముతో దరఖాస్తు చేసుకున్న సాధారణ ప్రజలు, లైసెన్స్ రాగానే దానిని భారీ ధరలకు అమ్మేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక సాధారణ గృహిణి రూ. 3 లక్షలతో దరఖాస్తు చేసుకోగా.. లాటరీలో ఆమెకు లైసెన్స్ దక్కింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఓ బడా మద్యం వ్యాపారి.. ఆమెతో బేరం కుదుర్చుకుని ఏకంగా రూ. 1.5 కోట్లకు ఆ లైసెన్స్ను కొనుగోలు చేశాడు. పేరుకు లైసెన్స్ ఆమెదే అయినా.. వ్యాపారం మాత్రం ఆ బడా వ్యాపారిదే. రూ. 3 లక్షల పెట్టుబడితో ఆ గృహిణి ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది. ఈ దందాలో అనుభవం లేని సాధారణ ప్రజలే కాక.. చిన్నపాటి సిండికేట్లు కూడా భారీగా లాభపడుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో ఏడుగురు మిత్రులు 15 దుకాణాలకు దరఖాస్తు చేయగా.. 5 దుకాణాలు దక్కాయి. వాటిలో రెండింటిని రూ. 85 లక్షల చొప్పున.. మరో మూడింటిని రూ. 3 కోట్ల చొప్పున ఇతరులకు విక్రయించారు. నల్లగొండ జిల్లాలో ఒక కుటుంబం 5 దరఖాస్తులు చేయగా 2 దుకాణాలు దక్కాయి. వాటిని రూ. 2 కోట్లకు విక్రయించి, రూ. 15 లక్షల పెట్టుబడిపై రూ. 1.85 కోట్ల లాభం పొందారు. సాధారణంగా.. లాటరీ తగిలిన లైసెన్స్లను రూ. 80 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు మరొకరికి అప్పగిస్తున్నారు. అసలు వ్యాపారులు ఇంత భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారంటే, రెండేళ్లలో అంతకు ఐదింతల లాభాన్ని కచ్చితంగా సంపాదించుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో.. దరఖాస్తుదారులకు వ్యాపార అనుభవం ఉందా లేదా? సరుకు కొనే శక్తి ఉందా లేదా? అనే కనీస అర్హతలను కూడా పరిశీలించకుండా దరఖాస్తులు స్వీకరించి లాటరీ నిర్వహిస్తోంది. దీంతో, 'లాటరీ తగిలితే లైఫ్ సెట్' అవుతుందని ఆశించిన గృహిణులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. లైసెన్సుదారు స్థానంలో మరొకరు వ్యాపారం చేయడం ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం తెలిసినప్పటికీ.. ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తు దుకాణంలో ఏదైనా దుర్ఘటన జరిగితే మాత్రం బాధ్యత వహించాల్సింది అధికారిక లైసెన్సుదారుడే అనేది ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa