తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన లే అవుట్లలోని వివాద రహితమైన ఓపెన్ ప్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు చేరువలో ఉన్న తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని మొత్తం 163 ప్లాట్లను ఈ నెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఈ వేలం ప్రక్రియ వివరాలను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. ఈ ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. ఈ లే అవుట్లు అన్నింటిలోనూ మౌలిక వసతుల కల్పన (రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్) ఇప్పటికే పూర్తయింది. కొనుగోలుదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకోవడానికి ఇవి అనువుగా ఉన్నాయని ఎండీ గౌతం స్పష్టం చేశారు.
ఈ వేలంలో అత్యధికంగా తొర్రూర్ ప్రాంతంలో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 125 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదివరకే తొర్రూర్ లే అవుట్లో 885 ప్లాట్లలో విడతల వారీగా 517 ప్లాట్లను విక్రయించగా.. ప్రస్తుతం మిగిలిన వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు కుర్మల్గూడలో 200-300 గజాల విస్తీర్ణంలో 25 ప్లాట్లు, బహదూర్పల్లిలో 200-1000 గజాల విస్తీర్ణంలోని 13 ప్లాట్లను విక్రయించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
వేలం ప్రక్రియ పెద్ద అంబర్పేటలోని అవికా కన్వెన్షన్లో జరుగుతుంది. నవంబర్ 17, 18 తేదీల్లో తొర్రూర్ ప్లాట్లకు, నవంబర్ 18వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. స్థలం స్వయంగా చూసుకునేందుకు కొనుగోలుదారులు సైట్లను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్లాట్లను చూసుకుని, పక్కనే ఇళ్లు నిర్మించుకున్న వారితో మౌలిక వసతుల గురించి వాకబు చేస్తూ, వాస్తు వంటి అంశాలను పరిశీలిస్తూ వేలం పాటలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ ప్లాట్లకు ఉన్న నమ్మకం, వాటి వివాద రహిత స్వభావం కారణంగానే ఈ ప్లాట్లకు ఇంతటి గిరాకీ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa