తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ప్రాణం పోసిన దిగ్గజ కవి, రచయిత అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ఘట్ కేసర్లోని ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ అంతిమయాత్రలో పాల్గొని.. పాడె మోసి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలకడం అందరి హృదయాలను కదిలించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ తన జీవితాన్ని, గళాన్ని, కలాన్ని నిస్వార్థంగా తెలంగాణ సమాజానికే అంకితమిచ్చారని కొనియాడారు. ఆయన చివరి రోజు వరకు సాధారణ జీవితం గడిపిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. దివంగత కవి కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటిస్తూ.. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
అంతేకాక.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను పాఠ్యాంశంగా పాఠశాల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందెశ్రీ రచనలన్నింటినీ సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చి.. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆయన రాసిన ‘నిప్పుల వాగు’ పుస్తకం ఒక మార్గదర్శిగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
అందెశ్రీ వ్యక్తిగతంగా తనకు చాలా దగ్గరి వ్యక్తి అని.. ఆయన లేని లోటు తన కుటుంబానికి వ్యక్తిగతంగా తీరని నష్టమని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. గతంలో గద్దర్ పాటతో పాటు, అందెశ్రీ పాట కూడా ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. ఆయన పేరు మీద ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
చివరిగా.. అందెశ్రీకి పద్మశ్రీ గౌరవం దక్కాలని గతేడాది కేంద్రానికి లేఖ రాసినా రాలేదని గుర్తు చేశారు. ఈసారి కూడా కేంద్రానికి లేఖ రాస్తామని.. ఈ విషయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి అందెశ్రీకి ఆ గౌరవాన్ని దక్కేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa