ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంధ్యా కన్వెన్సషన్ హాల్ యజమానికి హైకోర్టులో చుక్కెదురు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 07:41 PM

సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని ఎస్.శ్రీధర్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. గతంలో ఆయన మీద గచ్చిబౌలిలోని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు మీద హైకోర్టు తవీత్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఉద్యోగుల కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో రహదారులు పునరుద్ధరించాలని ఆదేశించింది. అలానే బాధితులకు అండగా ఉంటామని హైకోర్టు భరోసా కల్పించింది.


సంధ్యా కన్వెన్షన్ యజమాని.. గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లే ఔట్‌లో ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని గతంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు దీనిపై విచారించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక లేఅవుట్ ఖరారు అయిన తర్వాత, దాని సరిహద్దులను, కేటాయించిన స్థలాలను మార్చడానికి వీల్లేదని న్యాయమూర్తి బి. విజయసేన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ సంధ్యా కన్వన్షన్ యజమాని 20 ఎకరాల లేఅవుట్‌లోని 162 ప్లాట్లలో ఎక్కువ భాగం తనదేనని.. అలానే, ఎక్కువ ప్లాట్లు తమవేనని చెప్పుకుంటూ ఇతరుల స్థలాలను ఆక్రమించుకుంటున్నారని కోర్టు అభిప్రాయపడింది. రోడ్లు, పార్కులను అక్రమంగా ఆక్రమించుకుంటే వ్యవస్థ మౌనంగా ఉండదని కోర్టు హెచ్చరించింది.


ఇటీవల హైడ్రా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆ లేఅవుట్‌లోని కొన్ని రోడ్ల ఆక్రమణలను తొలగించింది. దీనిని శ్రీధర్ రావు హైకోర్టులో సవాలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో, బాధితులైన పలువురు ప్లాట్ యజమానులు తమ సమస్యలను కోర్టు ముందుంచారు. శ్రీధర్ రావు లేఅవుట్ సరిహద్దులను చెరిపివేసి, రోడ్లు, పార్కులు, పక్కనున్న ప్లాట్లను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని వారు ఆరోపించారు.


కొంతమంది ప్లాట్ యజమానులు శ్రీధర్ రావు చాలా ప్లాట్లు కొనుగోలు చేసి, మిగిలిన వాటిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇతర యజమానులను బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తాజాగా ఓ మహిళా ప్లాట్ యజమానిపై దాడి జరిగిందని, ఆమెపై అక్రమ కేసులు కూడా పెట్టారని బాధితులు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో శ్రీధర్ రావుపై నమోదైన మరో కేసులో సుప్రీంకోర్టు అతడికి రూ. 10 లక్షల జరిమానా విధించిందని బాధితులు కోర్టుకు వెల్లడించారు.


బెదిరింపులకు పాల్పడటం వల్ల తాము తమ సొంత ప్లాట్లకు వెళ్లడం లేదని తెలిపిన బాధితులు గతంలోనే హైడ్రాను ఆశ్రయించారు. దీంతో హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని.. ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే అని.. వాటిని సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా హైకోర్టు.. ఇప్పటికే లేఅవుట్ రోడ్లన్నింటినీ పునరుద్ధరించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. నిజమైన ప్లాట్ యజమానులకు తాము అండగా ఉంటామని న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 18న తుది విచారణకు రానుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa