తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నిక ఫలితం అధికారికంగా కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిన వెంటనే.. ఆమె ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ సాధారణ స్పందన కాదని.. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై కవిత చేసిన సంచలన వ్యాఖ్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత చేసిన పోస్ట్, బీఆర్ఎస్ పార్టీలోని ఒక వర్గానికి, ముఖ్యంగా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కలేదని భావిస్తున్న కవిత వర్గానికి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నట్లు తెలుస్తోంది.
కవిత ‘కర్మ’ ప్రస్తావన ద్వారా.. పార్టీలో జరుగుతున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు.. అనైతిక రాజకీయాల పర్యవసానమే ఈ ఓటమని సూచించినట్లుగా ఉంది. పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని ఆమె పరోక్షంగా ఈ ట్వీట్ ద్వారా పార్టీ అధిష్టానానికి, కేసీఆర్కు సంకేతం పంపినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న అంతర్గత ఒడిదుడుకులకు.. ఈ జూబ్లీహిల్స్ ఓటమి ఒక రకంగా తమ ప్రత్యర్థులకు తగిన జవాబు అని ఆమె భావించి ఉండవచ్చు. కాంగ్రెస్ గెలుపు అధికార పార్టీకి బలాన్ని ఇవ్వగా, బీఆర్ఎస్లో మాత్రం ఓటమికి బాధ్యులు ఎవరు అనే చర్చను.. అంతర్గత కలహాలను ఈ 'కర్మ హిట్స్ బ్యాక్' ట్వీట్ మరింత పెంచింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ను మినహాయించి ఇతర నాయకుల వైఫల్యాలను నిలదీస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆమె చేసిన " కర్మ హిట్స్ బ్యాక్ " ట్వీట్ ఈ అంతర్గత రాజకీయ విభేదాలకు నిదర్శనం.
ఈ ట్వీట్ ద్వారా.. పార్టీలో తన పట్టును తక్కువ చేసి చూసినవారిని, తన రాజకీయ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేసిన నాయకులను కవిత పరోక్షంగా విమర్శించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె వైఖరిని హేళన చేసినవారికి, జూబ్లీహిల్స్ ఫలితం "చెంప పెట్టు లాంటిది" అని కవిత అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. కవిత ట్వీట్ బీఆర్ఎస్లో త్వరలో జరగబోయే నాయకత్వ మార్పు లేదా అంతర్గత ప్రక్షాళనకు సంకేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే పోలవడంతో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa