ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 1000 కోట్ల ఫండ్..స్టార్టప్‌లకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 07:34 PM

స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేకంగా నిధులు సమకూర్చడానికి ముందుకు రానుంది. అందులో భాగంగా కోసం రూ. 1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫండ్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరినట్లు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. త్వరలో దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


స్టార్టప్‌లను ప్రోత్సహించేలా నిధి ఏర్పాటు చేయాలనే విషయాన్ని కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటగా రూ. 1000 కోట్ల నిధుల నిధిని సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ చెప్పారు. అయితే నిధులను యాక్సెస్ చేయడంలో స్టార్టప్‌లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు.. ఈ ఫండ్ నిదర్శనం అని చెప్పారు. స్టార్టప్‌లకు నిధులు లభిస్తే.. కంపెనీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. అయితే ఫండ్ ఏర్పాటు ప్రక్రియపై ఇంకా తాము కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. దీని కోసం తాము ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నామని.. త్వరలో తానే స్వయంగా వివరాలను వెల్లడిస్తానని సంజయ్ కుమార్ చెప్పారు.


ఏఐ స్టార్టప్‌లపై ఫోకస్..


తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు నిధులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. అయితే తాము ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేసే స్టార్టప్‌లపై దృష్టి సారిస్తామని చెప్పారు. తెలంగాణను ప్రపంచంలోనే ప్రముఖ AI హబ్‌గా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మెటా వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకుని.. వివిధ విభాగాల్లోని ఉద్యోగులను ఎంపిక చేసి AI శిక్షణను అందిస్తోందని తెలిపారు. ఆ ఉద్యోగులు స్టార్టప్‌లతో భాగస్వామ్యం అయ్యి.. AI ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారని శ్రీధర్ బాబు చెప్పారు.


స్టార్టప్‌లు పెట్టాలనుకుంటున్న ఔత్సాహికులు మొదటగా టీ-హబ్ లాంటి ఇంక్యుబేషన్ సెంటర్లలో నమోదు కావాల్సి ఉంటుంది. ప్రాథమిక దశలో స్టార్టప్ విజయవంతమైతే.. ఈ నిధులు అందిపుచ్చుకోవచ్చు. అయితే ఈ రూ. వెయ్యి కోట్లను.. ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంటే.. ఈ నిధులను వెంచర్ క్యాపిటల్ లేదా ఏంజెల్ ఫండ్స్‌లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. తర్వాత ఆ సంస్థలు స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa