ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్ల తర్వాత,,,,,ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 08:05 PM

తెలంగాణ ప్రభుత్వం .. 2025 చివర్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తాజాగా మంగళవారం నాడు ప్రభుత్వం.. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి మరో శాఖ ఉద్యోగులు చేరారు. పదోన్నతుల కోసం ఆ ఉద్యోగులు సుమారు 10 ఏళ్లుగా ఎదురు చూస్తుండగా.. తాజాగా ప్రభుత్వం వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే ప్రభుత్వం వారికి ప్రమోషన్లు ఇవ్వనుంది.


రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో పదోన్నతుల కోసం అధికారులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సోమవారం నిర్వహించిన సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 23 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లతో పాటుగా మరో ఇద్దరు చొప్పున అడిషనల్, జాయింట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో జీవో జారీ చేయనుంది.


అయితే ఈ శాఖలో పదోన్నతులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం.. ఈ శాఖలో.. డీసీలకు మాత్రమే క్షేత్రస్థాయి తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. పదోన్నతి పొంది పై స్థాయికి వెళితే తనిఖీలు చేసే అవకాశం కోల్పోతారు. అందుకే కొందరు ఉద్యోగులు.. చాలా ఏళ్ల నుంచి డీసీ, ఏసీలుగానే కొనసాగుతున్నారు. పైగా వీరిలో కొందరు డీసీలు తమకు ప్రమోషన్లు వద్దని లేఖలు రాయడం సంచలనంగా మారింది. ఓ ఉద్యోగి తనకు ప్రమోషన్ వద్దని.. తాను పనిచేస్తున్న జిల్లా నుంచి కదిలించొద్దంటూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ చర్యల వల్ల కిందిస్థాయిలోని సూపరింటెండెంట్లు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లకు ఏళ్ల నుంచి పదోన్నతి దక్కడం లేదు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ శాఖలో ఇంతవరకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టలేదు. పదేళ్లకుపైగా అర్హులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖలో ఒక్క అధికారి హోదా కూడా పెరగలేదు. ఈ క్రమంలో తాజాగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఈ శాఖ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. అనేక సార్లు డీపీసీ అధికారులు సమావేశమైనా ఎటూ తేల్చలేదు. ఆఖరికి ఎట్టకేలకు తాజాగా దీనిపై నిర్ణయం తీసుకోవడంతో.. పదోన్నతులకు ఆమోదం లభించినట్లు అయ్యింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa