ప్రపంచ మార్కెట్లో విమాన ఇంధన ధరలు పెరుగుతూ ఉండటంతో ఎయిర్లైన్స్పై భారీ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్కు చెందిన Air India దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ ధరలను పెంచే నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త ఛార్జీలు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశీయ ప్రయాణాల్లో దూరాన్ని బట్టి రూ.299 నుంచి రూ.899 వరకు అదనంగా ఇంధన సర్చార్జ్ వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ భారం మరింత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు సుమారు 280 డాలర్లు (దాదాపు రూ.23,000) వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విమాన నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చు సుమారు 40 శాతం వరకు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది.ఇదిలా ఉండగా, సంస్థలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా సీఈఓ Campbell Wilson తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. 2022లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఒప్పందం 2027 వరకు ఉన్నప్పటికీ, ముందుగానే వైదొలగడం గమనార్హం.ప్రస్తుతం సంస్థ ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటుండటం, గతంలో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈఓ ఎంపిక కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa