ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. వేంసూరు, లింగపాలెం, భీమవరం తదితర పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు మండల కేంద్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం పంటలకు ఎరువులు వేయాల్సిన అత్యవసర సమయం కావడంతో, యూరియా కోసం రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం నుండే క్యూ లైన్లలో రైతులు ఉన్నప్పటికీ, డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
సరైన సరఫరా లేక, గంటల తరబడి క్యూలో నిలబడినా ఎరువులు దొరుకుతాయో లేదో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి, ఎరువుల బస్తాల కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధ రైతులు, మహిళలు సైతం ఎండలో నిలబడలేక అవస్థలు పడుతున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి, రైతుల ఇబ్బందులను అర్థం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
క్యూలో నిలబడిన చివరి రైతు వరకు యూరియా అందుతుందనే నమ్మకం తమకు లేదని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మండల కేంద్రంలోనే కాకుండా, గ్రామ గ్రామాన యూరియా పంపిణీ చేపడితే అందరికీ న్యాయం జరుగుతుందని, రద్దీ కూడా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత పంపిణీ విధానం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, రైతుల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. పంపిణీ విధానంలో మార్పులు చేసి, ప్రతి రైతుకూ ఎరువులు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుండి తగినంత యూరియా సరఫరా జరగకపోవడమే ఈ ఆకస్మిక కొరతకు ప్రధాన కారణమని క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. పంట పొట్ట దశలోనూ, ఎదుగుదల దశలోనూ యూరియా చాలా అవసరమని, ఇప్పుడే దొరక్కపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అదనపు స్టాక్ను తెప్పించాలని, రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa