ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రబీ సీజన్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పంటలకు ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో స్టాక్ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు తల్లాడ వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) కార్యాలయానికి చేరుకుని, తమకు తక్షణమే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
సహకార సంఘం వద్ద అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో, ఆగ్రహించిన రైతులు తమ నిరసనను ఉధృతం చేశారు. యూరియా లేకపోవడం వల్ల సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తోందని, పెట్టుబడి పెట్టి నష్టపోవాలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రైతులంతా కలిసి తల్లాడలోని ప్రధాన రహదారిపైకి చేరుకుని బైఠాయించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాస్తారోకో సమాచారం అందుకున్న తల్లాడ వ్యవసాయ అధికారి ఎండి తాజుద్దీన్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఎరువుల నిల్వల విషయంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రోడ్డు పైనుంచి కదిలేది లేదని రైతులు భీష్మించుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే యూరియా లారీలను తెప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మండలంలోని రైతులకు యూరియా కోటాను కేటాయించేలా చూస్తానని వ్యవసాయ అధికారి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అధికార యంత్రాంగంపై నమ్మకంతో సుమారు రెండు గంటల పాటు కొనసాగిన రాస్తారోకోను విరమించి రహదారిపై నుంచి పక్కకు తప్పుకున్నారు. దీంతో ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగి వాహనాలు యధావిధిగా సాగాయి. ఒకవేళ హామీ నెరవేరకపోతే మళ్లీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రైతులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa