పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో రేవంత్ రెడ్డికి బాస్ అయిన చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే ఆంధ్రా ప్రయోజనాలకు గండి పడుతుందని, తద్వారా తన పాత బాస్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల తవ్వకం పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఒకవేళ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే దానికి సంబంధించిన ఘనత, పేరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వస్తుందనే భయం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే దక్షిణ తెలంగాణకు వరప్రదాయని లాంటి ఈ భారీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల వాటా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కేటీఆర్ స్పందిస్తూ, 45 టీఎంసీల నీటి వినియోగానికే ప్రభుత్వం ఒప్పుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాడాల్సింది పోయి, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నీటి కేటాయింపుల విషయంలో వెనక్కి తగ్గడం అంటే ఉమ్మడి పాలమూరు మరియు రంగారెడ్డి జిల్లాల ప్రజల గొంతు కోయడమేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులు కట్టడం చేతగాక, గత ప్రభుత్వం చేసిన పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని కాంగ్రెస్ తీరును కేటీఆర్ తూర్పారబట్టారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే పాలమూరు ప్రాజెక్టు పనులను నత్తనడకన నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, రాజకీయాలకు అతీతంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa