గత వానాకాలం సీజన్లో యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూరియా కోసం రైతులు... గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుని... పడిగాపులు కాశారు. దీనిపై విపక్షాల నుంచే కాక ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో యాసంగి సీజన్ యూరియా పంపిణీ కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా కొరతతో వర్షాకాలంలో ఇబ్బందులు పడిన రైతుల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం... ఈ యాసంగి సీజన్లో ఎరువుల పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు... 3.95 లక్షల ఎకరాల్లో వరి, 5.45 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ప్రారంభించారు. ఈ క్రమంలో తొలి విడత యూరియా పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో యూరియా సరఫరాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎకరాకు మూడు బస్తాల యూరియా సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. రబీ సీజన్ కోసం కేంద్రం కేటాయించిన 20.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులలో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియానే ఉంది.
ఈ క్రమంలో యూరియా పంపిణీలో పారదర్శకత పెంచడానికి... అలానే అక్రమాలకు చెక్ పెట్టడం కోసం... ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల చొప్పున యూరియా అందేలా 'ఫెర్టిలైజర్ యాప్'ను వ్యవసాయశాఖ ప్రవేశపెట్టింది. దీని కోసం పైలెట్ ప్రాజెక్ట్గా ముందుగా ఐదు జిల్లాల్లో యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించారు. నల్లగొండ, ఆదిలాబాద్, పెద్దపల్లి, జనగామా, మహబూబ్నగర్ జిల్లాల్లో 82,059 మంది రైతులు ఈ యాప్ ద్వారా 2,01,789 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.
మిగతా జిల్లాల్లో కూడా యాప్ బుకింగ్ ద్వారా యూరియా పంపిణీ చేయాలని భావించినా... రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, వారి అవసరాలకు అనుగుణంగా పట్టా పాస్పుస్తకం ఆధారంగా రేషన్ పద్ధతిలో సరఫరా చేయాలని నిర్ణయించారు. వరితో పాటు మొక్కజొన్న, ఇతర పంటలకు కూడా పంట విస్తీర్ణానికి తగినట్లుగా యూరియా సరఫరా చేయనున్నారు.
మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు, అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరిగేలా వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గత వానాకాలంలో మాదిరి ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడకుండా, ఈసారి సరఫరాను మెరుగుపరచడానికి అధికారులు ముందు నుంచే రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.
యాప్ ద్వారా పంపిణీ చేయడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు నేరుగా ఎరువులు అందుతాయని ఆశిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, రైతులు ఇబ్బందులు పడకుండా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa