తెలంగాణ సర్కార్... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే కొత్త సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం (టిఫిన్) అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ అల్పాహార పథకాన్ని పూర్తిగా అమలు చేయడానికి పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేద విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు, పాఠశాలల్లో హాజరుశాతాన్ని పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
ఈ పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా వారంలో 3 రోజులు అన్నంతో చేసే వంటలు (పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ వంటివి), మరో రెండు రోజులు ఉప్మా వంటి వాటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందుతోంది. దీనికి అదనంగా టిఫిన్ కూడా అందించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని... ఇకపై ఇంటర్ కాలేజీల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ చదువుతుండగా... వీరందరికి మధ్యాహ్న భోజనం అందించే విషయంపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. అలాగే, ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందించే విషయంపై కూడా ఇంటర్ బోర్డు ఆలోచనలు చేస్తోంది. ఈ చర్యలన్నీ విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి సంక్షేమానికి దోహదపడతాయని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు పెంచడానికి విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 495 కేజీబీవీలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa