ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు, అధికారులు మున్సిపాలిటీల వారీగా కొత్త ఓటర్ల జాబితా రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ క్రమంలోనే వార్డుల వారీగా ఓటర్ల వివరాలను సేకరించి, వాటిని క్రోడీకరించే పనుల్లో రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు.
బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ పి. శ్రీజ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల విభజన ఏ విధంగా జరుగుతోంది, వార్డుల వారీగా జాబితాల తయారీలో సిబ్బంది అనుసరిస్తున్న విధానాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆమె, ఆన్-లైన్ డేటా ఎంట్రీలో తలెత్తుతున్న సందేహాలను అధికారులకు వివరించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా తయారీలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని, మరణించిన వారి పేర్లు లేదా రెండు చోట్ల ఉన్న పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటించాలని, గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. వార్డుల పునర్విభజన మరియు పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై కమిషనర్ అదనపు కలెక్టర్ కు వివరణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఓ (BLO) లు అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ జాబితాను ఖరారు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa