ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా జలాల వివాదం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలే శాపమన్న బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 03:35 PM

కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రెండు పార్టీలు అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి తక్కువ కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో రెండింటికీ సమాన భాగస్వామ్యం ఉందని ఆయన విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలు చాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ చేసిన తప్పు వల్లే నేడు రాష్ట్రం సాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కంటే రాజకీయ ప్రయోజనాలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని, ఆ ఒప్పందం వల్ల తెలంగాణకు రావాల్సిన వాటా తగ్గిపోయిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఆయన విశ్లేషించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోరిన నీటి లభ్యత వివరాలను అందించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయని, అందుకే డీపీఆర్ (DPR)ను కేంద్రం వెనక్కు పంపిందని వివరించారు. సరైన గణాంకాలు ఇవ్వకుండా, సాంకేతిక అంశాలను పట్టించుకోకుండా ప్రాజెక్టును రాజకీయాలకు వాడుకున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిందారోపణలు మానుకుని, ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. కేంద్రంపై బురద జల్లడం వల్ల ప్రయోజనం లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకే రాష్ట్రం నీటి వాటాను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa