ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ ప్రక్షాళనకు మేము అడ్డుకాదు..: ఎమ్మెల్యే హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 07:36 PM

తెలంగాణ శాసనసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు ముదిరింది. మూసీ నది ప్రక్షాళన అంశంపై జరుగుతున్న చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు మూసీ ప్రక్షాళనను మొదలుపెట్టిందే తామని.. ఈ ప్రక్రియకు తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో గంటన్నర పాటు మాట్లాడిన తర్వాత.. ప్రతిపక్షానికి కనీసం సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకపోవడాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా సభ సాగుతోందని.. అందుకే శీతాకాల సమావేశాల్లోని మిగిలిన రోజులకు కూడా హాజరుకాకూడదని నిర్ణయించినట్లు ప్రకటించారు. ముఖ్యంగా జనవరి 3వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలను సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. సభలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


సభను వాకౌట్ చేసిన అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజూ కేసీఆర్ చావును కోరుకునేలా వ్యాఖ్యలు చేయడం ఒక ముఖ్యమంత్రికి తగదన్నారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణదారుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా వసూళ్లకు పాల్పడుతోందని.. దీనినే 'ఆర్ఆర్ టాక్స్' అని ఆయన అభివర్ణించారు. ఏ బిల్డింగ్ కట్టాలన్నా అధికార పార్టీకి పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు.


మరోవైపు.. కృష్ణా, గోదావరి జలాల వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభను బహిష్కరించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలు, వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి పారిపోతున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. సభలో చర్చకు సిద్ధంగా లేని వారు బయట విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa