తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని, ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కార్పొరేట్ విద్యా సంస్థలపై నిప్పులు చెరిగారు.
సమాజంలో పేదరికం పోవాలన్నా, సమస్యలు తీరాలన్నా నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏటా విద్యా రంగంపై వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే ఆ ఫలితాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పాఠశాలను దేశానికే ఒక 'మోడల్ స్కూల్'గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆధునిక హంగులు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా ప్రాంగణాలతో నిర్మితమైన ఇటువంటి ప్రభుత్వ పాఠశాల దేశంలో మరెక్కడా ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రైవేటు విద్యా సంస్థల తీరుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థలు విద్యా వ్యాపారం చేస్తూ దొంగలుగా మారాయి' అని ఆయన మండిపడ్డారు. అడ్మిషన్ల సీజన్ వస్తే ఆ ఫీజుల దోపిడీ చూస్తుంటే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు లక్షల ఫీజును రికమెండేషన్తో రెండు లక్షలకు తగ్గిస్తామని చెప్పడం పెద్ద మాయాజాలమని, అసలు ఆ సంస్థల ఫీజులే అత్యధికమని విమర్శించారు. చట్టప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని ఉన్నా.. కార్పొరేట్ శక్తులు ఆ చట్టాలను తుంగలో తొక్కి సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బీఈడీ, టెట్, డీఎస్సీ రాసిన మేధావులైన ఉపాధ్యాయులు ఉంటే.. ప్రైవేటు సంస్థల్లో అరకొర చదువులు చదివిన వారితో బోధన చేయిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం బట్టీ పద్ధతిని ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల విద్యార్థుల్లో మార్కులు వస్తున్నా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఉన్నత చదువుల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ఈ కార్పొరేట్ సంస్కృతే కారణమని అన్నారు. 'నాకు గనుక విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే.. ఈ కార్పొరేట్ దోపిడీ సంస్థలన్నింటినీ వెంటనే బంద్ చేయిస్తా' అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa