ప్రస్తుతం సమాజంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. మనిషి పక్కన ఉన్నా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అంతే కాకుండా.. పక్క వాడు ఆపదలో ఉన్నాడని తెలిసినా.. మనకెందుకులే అని వెళ్లిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడ ఓ ఉద్యోగి చేసిన పనికి అందరూ హ్యాట్సాప్ చెప్పాల్సింది. ఓ పసి వాడి ప్రాణం ఆపదలో ఉందని తెలిసి అతడు అక్కడ నుంచి దూరంగా వెళ్లలేదు. తన విధిని పక్కన పెట్టి మరీ.. ఆ చిన్నారిని కాపాడాడు. జిగిత్యాల జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగి రాజేష్ ఉదంతం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
అసలు ఏం జరిగిందంటే.. ఎన్నికల విధుల కోసం ఆఫీసులోకి అడుగుపెట్టే ముందు.. కాస్త అలసట తీర్చుకుందామని రాజేశ్ టీ తాగడానికి శ్రీరామ చౌరస్తా వైపు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక ఆటో.. యాక్టివా వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వాహనంపై ఒక యువతి, యువకుడు, ఐదేళ్ల చిన్న బాబు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు పిల్లాడు రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మకు బలంగా తగిలి పడిపోయాడు. తలకు దెబ్బ తగలడంతో ఆ పసివాడు అక్కడికక్కడే కళ్లు తేలేశాడు.
చుట్టు పక్కల ఉన్నవారు ఆ చిన్నారి పరిస్థితి చూసి కంగారు పడ్డారు. ఎవరూ ధైర్యం చేసి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ రాజేశ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా... తల్లి, బంధువులు తేరుకునే లోపే.. ఆ పిల్లాడిని తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రి వైపు పరుగు తీశారు.
మృత్యువు వాకిలి వరకు వెళ్లి..
ఆసుపత్రికి చేరగానే వైద్యులు బాబు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి వెంటనే సీపీఆర్ (CPR) చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ పిల్లాడిని ఆసుపత్రికి తరలించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడే అవకాశం దక్కింది. సీపీఆర్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ఆ చిన్నారి స్పృహలోకి వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటివరకు ప్రాణభయంతో విలపించిన ఆ తల్లికి.. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలియగానే కలిగిన ఆనందానికి అవధులు లేవు.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. రాజేశ్ ఒక ఉద్యోగిగా కాకుండా.. ఒక పౌరుడిగా ఆలోచించి వ్యవహరించడం వల్ల ఆ కుటుంబంలో విషాదం నిండకుండా ఆగిపోయింది. నేటి సమాజం ఎలా ఉందంటే.. ప్రమాదం జరిగితే.. ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉన్న ఆసక్తి వారిని కాపాడాలనే ఆలోచన చేసే వారు కరువు అవుతున్నారు. రాజేష్ లాంటి వ్యక్తులు మన మధ్య ఉండటం గర్వకారణమనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa