ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా.. హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా కేవలం హైదరాబాద్లోనే పరిమితం కాకుండా.. హైదరాబాద్ వెలుపల కూడా తన పనిని ప్రారంభించింది. అక్రమ కట్టడాలను నేల మట్టం చేస్తూ కబ్జాదారులకు హెచ్చరికలు పంపిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెరువును కబ్జాదారుల చెర నుంచి కాపాడింది.
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూరులోని మేళ్ల చెరువు ఆక్రమణపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు జరిగాయంటూ ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల కారణంగా హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రంగంలోకి దిగింది. ఆక్రమణకు గురైన ప్రాంతంలో బండరాళ్లు, మట్టి పోసి చదును చేసినట్లు హైడ్రా గుర్తించింది.
అంతే కాకుండా..చెరువులో నుంచి నీళ్లు రాకుండా ప్రహరీలను నిర్మించినట్లు కూడా హైడ్రా గుర్తించింది. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వీటిని నేలమట్టం చేశారు. అంతే కాకుండా.. చెరువు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 40 ఎకరాల స్థలాన్ని హైడ్రా ఆక్రమణల చెర నుంచి కాపాడింది. అయితే చెరువు భూమిలో అక్రమంగా నిర్మాణాలకు అవకాశం లేదని.. కేవలం రైతులు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించింది.
లే అవుట్లోకి 4 వేల గజాల వరకు ఆక్రమణ..
ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలోని శబరి హిల్స్లో ఏర్పాటు చేసిన లే అవుట్లో హైడ్రా చర్యలు చేపట్టింది. ఓ వ్యక్తి ఇక్కడ లే అవుట్లో 20 ప్లాట్లను ఆక్రమించాడు. తన స్థలంలో నాలా వెళ్తోందనే సాకుతో రహదారులు మూసేసి ప్రహరీ నిర్మించారు. ప్లాట్ల యజమానుల ఫిర్యాదుతో సర్వే నిర్వహించిన హైడ్రా.. ఆక్రమణలను నిర్ధారించి చర్యలు చేపట్టింది.
లే ఔట్లోకి 4 వేల గజాల వరకు ఆక్రమణ జరిగినట్టు నిర్ధారించుకుని.. అందులోని రహదారులకు ఆటంకంగా ఉన్న ప్రహరీలను హైడ్రా గురువారం తొలగించింది. దీంతో శబరిహిల్స్ లే ఔట్ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాకుండా.. భవిష్యత్లో వీటికి శాశ్వత పరిష్కారాలను చూపించే విధంగా చర్యలు చేపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa