యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ను ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడడంతో ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు సుమారు అరగంటకు పైగా శ్రమించారు. గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్యాబిన్ భాగాలను కట్ చేసి చివరకు డ్రైవర్ను క్షేమంగా బయటకు తీయగలిగారు. అనంతరం అతడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై నాలుగు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa