ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు.. బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 06:54 PM

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కూడా హోరాహోరీగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో పడ్డాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ .. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో.. బీజేపీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో కాషాయజెండాను ఎగురవేస్తే.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులను తీసుకువస్తానని వెల్లడించారు.


మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. మొదటి విడత కింద తెలంగాణకు ఏకంగా రూ.500 కోట్లు తీసుకొస్తామని బండి సంజయ్‌ తేల్చి చెప్పారు. ఇవాళ హుజూరాబాద్‌ సూపర్‌ బజార్‌ చౌరస్తాలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిర్వహించే అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ.వందల కోట్ల నిధులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.


రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కావాల్సిన అన్ని పరికరాలు తీసుకువస్తే.. కాంగ్రెస్ సర్కార్ సరిగ్గా సిబ్బంది నియామకాలు జరపట్లేదని బండి సంజయ్ ఆరోపించారు. గత 10 ఏళ్ల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని వెల్లడించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ గతంలో ఇచ్చిన హామీలను అమలు నెరవేర్చిందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.


ఇక హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మినీ స్టేడియం నిర్మిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక హామీ ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీనిను గెలిపిస్తే మున్సిపాలిటీలోని అన్ని ట్యాక్స్‌లు పెంచుతారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి.. తాము ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్‌ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.259 కోట్లు నిధులు విడుదల చేసినట్లు బండి సంజయ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa