ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మినీ స్టేడియం నిర్మిస్తామని హామీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 07:48 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు రూ.500 కోట్లు తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.గత కొన్నేళ్లుగా హుజూరాబాద్ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని పరికరాలను తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవసరమైన సిబ్బందిని నియమించడం లేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హుజూరాబాద్ అభివృద్ధికి పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మినీ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని రకాల పన్నులు పెంచుతారని ఆరోపించారు.రాబోయే బడ్జెట్‌లో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఇతర హామీల్లాగే ఇదీ ఉందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాత్రమే తెలంగాణకు ఇళ్లు వచ్చాయని అన్నారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి చర్లపల్లి జైలులో రెండు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా కదిలించలేకపోయారని అన్నారు.తెలంగాణలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి రూ.259 కోట్ల నిధులు తీసుకువచ్చామని బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, తాను నిరంతరం సంప్రదింపులు జరిపి ఈ నిధులు తెచ్చామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలతో సరిపెట్టదని, కిందిస్థాయి వరకు నిధులు చేరుతాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నిధులు ఇంతటితో ఆగవని, దశలవారీగా వస్తూనే ఉంటాయని అన్నారు. అభివృద్ధి చేసే పార్టీలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa