తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి. ఈనెల 7, 8వ తేదీల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించి.. జనసేనతోపాటు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ కూడా ప్రకటన విడుదల చేసింది. అయితే చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి దృష్ట్యా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ అగ్రనేతలే పవన్ కళ్యాణ్ పర్యటనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారనే వార్తలను ఇటీవలె కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా అదే రకమైన వార్తలు చేశారు. బీజేపీకి, జనసేనకు ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉందని.. కానీ తెలంగాణలో లేదని తేల్చి చెప్పారు. బీజేపీకి ఏ పార్టీ, ఏ వ్యక్తి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదిగేంత శక్తి కలిగి ఉందని ధర్మపురి అర్వింద్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ జనసేనతో బీజేపీ పొత్తు విషయంపై స్పందించిన ధర్మపురి అర్వింద్.. రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్య పొత్తుల విషయంలో తేడాలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలు వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాయని.. ఆ తర్వాత కూడా ఆ రాష్ట్రంలో పొత్తు కొనసాగుతోందని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని.. ఇక్కడ ఇతర పార్టీల మద్దతు తమకు అవసరం లేదని ధర్మపురి అర్వింద్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రచారం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ధర్మపురి అర్వింద్.. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa