ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాది మహిళలు 10 పెళ్లిళ్లు చేసుకుంటారు.. తమిళ మంత్రి వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 07:58 PM

కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య గత కొన్ని రోజులుగా హిందీ భాష, డీలిమిటేషన్ విషయంలో తీవ్ర ఘర్షణ జరుగుతోంది. తమిళ పార్టీలు మరీ ముఖ్యంగా అధికార డీఎంకేకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలతో నిరంతరం మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా హిందీ భాషను తమపై రుద్దుతున్నారని తమిళ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చూస్తోందన్న వార్తలపైనా డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అలా చేస్తే ఉత్తరాదిన ఎంపీ సీట్ల సంఖ్య పెరిగి.. దక్షిణాదిన ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఎంకే నేత, తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని పేర్కొన్నారు. తమిళ ఆచారాల లాగా కాకుండా.. ఉత్తర భారతదేశ సంప్రదాయాలు బహుభార్యత్వం, బహు భర్తృత్వం కలిగి ఉంటాయని దురై మురుగన్ చెప్పారు. ఈ క్రమంలోనే తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరోక్షంగా మహాభారతాన్ని ప్రస్తావించిన దురై మురుగన్.. ఉత్తర భారత సంస్కృతి ఒక స్త్రీ 5 లేదా 10 మంది పురుషులను పెళ్లి చేసుకునేందుకు అనుమతిస్తుందని పేర్కొన్నారు.


అదే సమయంలో మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడని.. కానీ ఉత్తర భారతదేశంలో ఒక స్త్రీ అనేకమంది పురుషుల్ని వివాహం చేసుకోవచ్చని మంత్రి దురై మురుగన్ తెలిపారు. అలాగే ఐదుగురు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చని.. ఇది వారి సంస్కృతి, ఒకరు వెళ్తే మరొకరు వస్తారని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.


దేశంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అన్ని రాష్ట్రాల్లోనూ జనాభాను నియంత్రించాలని సూచించారని గుర్తు చేసిన దురై మురుగన్.. వాటిని అమలు చేసిన దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిందని తెలిపారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం జనాభా తగ్గలేదని.. వారు 17, 18, 19 మంది పిల్లలకు జన్మనిచ్చారని.. వారికి వేరే పని లేదని పేర్కొన్నారు. అయితే మంత్రి దురై మురుగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దురై మురుగన్ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ఉత్తర భారతదేశం పట్ల డీఎంకేకు ఉన్న ద్వేషాన్ని నిరూపిస్తున్నాయని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com