పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత ఐదేళ్లలో ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని.. పునరావాస కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంటు పనులు కూడా చేయలేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు కనీసం తాగడానికి మంచి నీళ్ల ప్యాకెట్లు కూడా ఇవ్వలేదని, ఒక్క నాయకుడు కూడా వెళ్లి పరామర్శించలేదని.. దీనివల్లే బాధితులు తమను తెలంగాణలో కలిపేయాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని చెప్పారు. 2019 ఎన్నికల ముందు.. పోలవరం ప్రాజెక్టులో ఫేజ్-1 ఫేజ్-2 అని గానీ, 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అని గానీ జగన్ ఎక్కడా ప్రస్తావించలేదని.. అధికారంలోకి వచ్చాక 2022లోనే మొట్టమొదటిసారి ఫేజ్-1 అని, 41.15 మీటర్లు అని.. 45,72 మీటర్లు, ఫేజ్-2 అని తెరపైకి తెచ్చారని, దీనిని వైసీపీ సభ్యులు గుర్తించాలని అన్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ, కూటమి ప్రభు త్వం 41.15 మీటర్ల కాంటూరులో ఫేజ్-1 కింద 2026 జూన్ నాటికి సహా య, పునరావాసం, ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫేజ్-2 లో 45.72 మీటర్ల ఎత్తున ఆర్అండ్ఆర్కు సంబంధించిన అంచనాలను కూడా సిద్ధం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. కొత్తగా రాడార్ సర్వే చేయడం ద్వారా 49 గ్రామాలు ముంపు పరిధిలోకి వచ్చాయని.. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వారికి మూడు ఆప్షన్లు ఇస్తున్నామని తెలిపారు. నిర్వాసితుల నుంచి దరఖాస్తులు తీసుకుని ఈ నెలలోనే గ్రామ సభలు పూర్తి చేసి, ఏప్రిల్ నెలాఖరులోగా నిర్వాసితులు కోరుకున్న విధంగా ఆర్అండ్ఆర్కు సంబంధించిన కాలనీలు గుర్తిస్తామని.. తర్వాత 90 రోజుల్లోనే ఆగస్టులోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa