రాజమండ్రిలో ఒక నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. గంజాయి కేసులో పదేళ్ల శిక్ష పడిన నిందితుడికి అతని భార్య భోజనం తెచ్చింది. అయితే భోజనం తిని వస్తానని చెప్పిన నిందితుడు.. పోలీసుల కళ్లు గప్పి కోర్టు గోడ దూకి పారిపోయాడు. ఈ సంఘటన రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం రోజు జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా ములగపూడికి చెందిన లావేటి తల్లిబాబు అనే వ్యక్తిని పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. తల్లిబాబుతో పాటుగా మరో వ్యక్తిని 2019లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
అయితే అప్పటి నుంచి తల్లిబాబు, మరో నిందితుడు రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే తాజాగా రాజమహేంద్రవరం జిల్లా కోర్టు వీరి కేసును విచారించింది. ఇద్దరూ తప్పు చేసినట్లు తేలడంతో రాజమహేంద్రవరం జిల్లా కోర్టు వీరికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. పదేళ్ల జైలు శిక్షతో పాటుగా లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ఒకటో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో పోలీసులు వీరిని జైలుకు తరలించడానికి సిద్ధమయ్యారు.
అయితే అదే సమయంలో తల్లిబాబు భార్య అతని కోసం భోజనం తీసుకువచ్చింది. అప్పటికే మధ్యాహ్నం కావడంతో అన్నం తినేసి వెళ్లిపోదాం సార్ అంటూ తల్లిబాబు పోలీసులను ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు కనికరించి అందుకు ఒప్పుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదంటూ చేతికి బేడీలు వేశారు. తల్లిబాబు భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులు పక్కనే ఉన్నారు. అయితే అప్పటి వరకూ పద్ధతిగా ఉన్న తల్లిబాబు.. ఆ తర్వాత తన ప్లాన్ అమలు చేాశాడు. చేయి శుభ్రం చేసుకుని వస్తాను సర్ అని చెప్పిన తల్లిబాబు కోర్టు గోడ దూకి పారిపోయాడు. తల్లిబాబు పారిపోతున్న సంగతిని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని పట్టుకునేందుకు వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. తల్లిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే నిందితుడు పరారైన ఘటనపై డీఎస్పీ కె.రమేష్బాబు ఈ వివరాలు తెలియజేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే జైలు శిక్ష పడిన వ్యక్తి ఇలా పరారవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
![]() |
![]() |