బట్టతల ఉందని భార్య హేళన చేయడంతో భరించలేకపోయిన భర్త.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య తరుచూ సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేయడంతో అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో అతడి మనసు విరిగి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన మరో ఘటన బెంగళూరు సమీపంలోని చామరాజనగరలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చామరాజనగర తాలూకా ఉడిగాల గ్రామానికి చెందిన పరశివమూర్తి (32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసిన అతడు... భార్య మమత తనను ఏవిధంగా వేధింపులకు గురిచేసిందీ వివరించాడు.
భార్య మమత తరచుగా తనకు బట్టతల ఉందని ఎగతాళి చేస్తూ..జుట్టులేని నీతో బయటకు వెళ్లడానికి నాకు సిగ్గుగా ఉందని సూటిపోటి మాటలతో మనను నొచ్చుకునేలా వ్యవహరించేది. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన పరశివమూర్తికి జుట్టు పూర్తిగా రాలిపోయింది. దీనిని ఆమె తరుచూ గుర్తుచేస్తూ సూటిపోటి మాటలతో పరశివమూర్తి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించేది. ఇదే సమయంలో అతడిపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే మమత.. అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
ఈ విషయంపై తరుచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఎంతగా చెప్పినా భార్య తీరు మార్చుకోకపోవడంతో పరశివమూర్తి కలత చెందాడు. దీనికి తోడు తప్పుడు కేసులు పెట్టడంతో భరించలేకపోయాడు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను రాసిన సూసైడ్ నోట్లో బట్టతల ఉందని తరుచూ ఎగతాళి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని,. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. సూసైడ్ నోట్, తల్లిదండ్రుల ఫిర్యాదుతో భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండేళ్ల కిందటే మమతతో పరమశివమూర్తికి వివాహం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. పెళ్లినాటికే అతడికి బట్టతల ఉండేదని, ఈ విషయం తెలిసే ఆమె వివాహం చేసుకుందని వివరించారు.
![]() |
![]() |