ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు కంపెనీ బస్సులో అగ్ని ప్రమాదం.. నలుగురు ఉద్యోగులు సజీవదహనం

Crime |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:28 PM

వారంతా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కంపెనీయే బస్సు పెట్టగా.. అందులోనే వెళ్లి వస్తున్నారు. ఈరోజు కూడా ఆ బస్సులోనే ఆఫీసుకు వెళ్తుండగా.. మార్గ మధ్యంలో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు, డ్రైవర్.. బస్సులోంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. తలుపు దగ్గరగా ఉన్నవారు కిందకు దిగిపోగా.. లోపల ఉన్న వారు మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ అది తెరుచోకపోవడంతో బస్సులోని మంటలకు ఆహుతయ్యారు. మొత్తంగా నలుగురు ఉద్యోగులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాధకర ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మహారాష్ట్రలోని హింజేవాడిలోని వ్యోమా గ్రాఫిక్స్ కంపెనీలో అనేక మంది పని చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రత్యేకంగా బస్సులు పెట్టి మరీ తమ ఉద్యోగులకు.. ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఈక్రమంలోనే అక్కడ పని చేస్తున్న వారంతా సమయానికి బస్సుల్లో వెళ్లేవారు. ఈరోజు కూడా ఓ 12 మంది ఉద్యోగులు వార్జే నుంచి హింజేవాడికి కంపెనీ మినీ బస్సులో ప్రయాణం అయ్యారు. అయితే పింప్రి చించ్‌వాడ్‌లోని డస్సాల్ట్ సిస్టమ్స్ సమీపానికి చేరుకోగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.


 గమనించిన డ్రైవర్ బస్సును ఆపేలోపే.. ముందు భాగానికి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన నలుగురు ఉద్యోగులు వెంటనే ముందున్న తలుపు నుంచి బయటకు దిగేశారు. అయితే వెనుక కూర్చున్న వారు ముందుకు వచ్చేలోపే మంటలు ఎక్కువ కాగా.. వెనుక ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా దాన్ని తెరువబోతుండగా అది ఓపెన్ కాలేదు. ఫలితంగా వారు బస్సులోనే ఉండగా.. మంటలు మరింత ఎక్కువయ్యాయి.


దీంతో నలుగురు ఉద్యోగులు బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. అయితే మరో ఐదుగుర మాత్రం తీవ్రంగా గాయ పడగా.. ఎలాగోలా బయటకు వచ్చేశారు. విషయం గర్తించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్సు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పగా.. వైద్య సిబ్బంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించింది. మరోవైపు పోలీసులు కూడా అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్ారు. అఫీసుకు వెళ్తున్నామని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com