ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు నాయుడు 1996 నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని మందకృష్ణ గుర్తు చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 08:39 PM

షెడ్యూల్డ్ కులాల  వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిల మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ వైఖరిని జగన్ స్వయంగా వెల్లడించాలని, ఇది సామాజిక న్యాయమా లేక దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా అనేది తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం జరిగిన అనంతరం వైఎస్సార్సీపీ వైఖరిపై స్పష్టత కొరవడిందని మందకృష్ణ విమర్శించారు. ఈ అంశంపై పార్టీ అధినేత జగన్ స్వయంగా మాట్లాడకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ద్వారా అభిప్రాయం చెప్పించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలుగుతోందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు 1996 నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని, ఈ విషయంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని మందకృష్ణ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ కారణమని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.వైసీపీలో మాదిగలకు ప్రాధాన్యత లేకుండా పోతోందని, మాలల కోసమే పనిచేసే వారికి పెద్దపీట వేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. వైసీపీలో ఉన్న మాదిగలు ఎక్కడున్నా వర్గీకరణను కోరుకుంటారని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటుంటే, వైసీపీలోని మాదిగలు మాత్రం స్తబ్దతగా ఉన్నారని ఆయన విమర్శించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వర్గీకరణ జరగాలని ప్రధానికి లేఖ రాసిన జగన్, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ఆయన ప్రశ్నించారు. నిండు సభలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్య చిచ్చు పెట్టారని జగన్ ఆరోపించడం ఆయన గత వైఖరికి విరుద్ధమని మందకృష్ణ అన్నారు.సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్‌ను పెట్టమని కోరితే జగన్ పట్టించుకోలేదని మందకృష్ణ విమర్శించారు. 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com