దివంగత పారిశ్రామికవేత్త నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన అర్ధాంగి డాక్టర్ శాంతారావు నార్నే, 'అన్న క్యాంటీన్'కు భారీ విరాళం ప్రకటించారు. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసిన డాక్టర్ నార్నే శాంతారావు రూ.1,00,01,016 చెక్ ను అందించారు. ఈ సందర్భంగా నార్నే శాంతారావు మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిన సందర్భంగా నారా భువనేశ్వరి గారు కోటి రూపాయల విరాళం ఇవ్వడం తనకు స్ఫూర్తినిచ్చిందని డాక్టర్ శాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. నార్నే రంగారావు గారు మరణించడానికి ఒకరోజు ముందు కూడా ఈ విరాళం గురించి గుర్తు చేశారని ఆమె అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "నార్నే రంగారావు మరణానంతరం తన కుమార్తె, నార్నె ఎస్టేట్స్ డైరెక్టర్ అడుసుమిల్లి దీప, వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్తో కలిసి వచ్చి శాంతారావు గారు ఈ విరాళాన్ని సీఈవో నార్నె గోకుల్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. పేదలకు రూ. 5 లకే అన్నం పెట్టాలనే ఆలోచనకు ఇలాంటి వారి మంచి మనసు ఎంతో దోహదం చేస్తుంది. ఎంతో నిజాయతీగా, ఆదర్శంగా జీవితాన్ని గడిపిన నార్నే రంగారావు గారు కాలం చేయడానికి ఒక రోజు ముందు కూడా అన్న క్యాంటీన్ విరాళం గురించి భార్యకు గుర్తు చేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.
![]() |
![]() |