హైదరాబాద్ మీర్పేట్ మాధవి హత్య కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇంట్లో దొరికిన టిష్యూ పేపర్లో మాధవి డీఎన్ఏ మ్యాచ్ అయినట్లు పోలీసులకు తాజాగా రిపోర్ట్ అందింది. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులకు కీలక ఆధారంగా దొరికిన టిష్యూను డీఎన్ఏ టెస్టుకు పంపగా.. అవి ఆమె పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు తెలిసింది. దాని ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
పోలీసులు తమ లైఫ్ టైంలో చూడని కేసు..
కాగా, ఈ ఏడాది జనవరిలో మీర్పేట్లో జరిగిన మాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. భర్త గురుమూర్తి మాధవిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఉడికించి, కాల్చి, పౌడర్గా మార్చి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. అనంతరం ఏం తెలియనట్లు తన భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడ్రోజుల తర్వాత భర్తే హత్య చేసినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ హత్య పోలీసులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. గురుమూర్తి ఈ హత్యను పక్కా ప్రణాళికతో చేశాడని రాచకొండ సీపీ తెలిపారు. ఇది తన సర్వీసులో చూసిన అత్యంత క్రూరమైన కేసు అని అన్నారు. గురుమూర్తి మాధవిని ఎంత క్రూరంగా హత్య చేశాడో, మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరించారు.
'గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యను హత్య చేయాలనే ఉద్దేశంతోనే గురుమూర్తి తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచాడు. జనవరి 16న ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలో భాగంగానే మాధవిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మాధవిని తలను గోడకేసి బాది చంపేశాడు. మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ఆమె శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. కిచెన్లో ఉన్న పెద్ద కత్తి తీసుకొచ్చాడు. మొదట మొండెం నుంచి తలవేరు చేశాడు. ఆ తర్వాత మాధవి భుజాలను కట్ చేశాడు.
ఆ తర్వాత బాడీ నుంచి కాళ్లను కూడా కట్ చేసి వేరు చేశాడు. కాళ్లు, చేతులను ఒక మొద్దుపై ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను బకెట్లో వేసి.. వాటర్ హీటర్ సహాయంతో కొన్ని గంటలపాటు ఉడికించాడు. ఆ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత.. ఆ భాగాలను తీసి పెద్ద స్టవ్ మీద బాగా కాల్చాడు. బాగా కాలిన తర్వాత వాటిని ఎముకలను రోట్లో వేసి దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ను ఓ పెయింటింగ్ బకెట్లో నింపాడు. ఆ బకెట్ను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. అని సీపీ వెల్లడించారు.
మధవిని చంపి ముక్కలుగా చేసి వాటిని ఉడికించి పౌడర్గా మార్చేందుకు సుమారు 8 గంటల సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎలాంటి ఆధారం దొరకకుండా ఉండేందుకు డిటర్జెంట్తో పాటు ఫినాయిల్తో ఇంటిని బాగా కడిగాడని.. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంత చేసినా గురుమూర్తికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని సీపీ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, ప్రస్తుతం కేసు నడుస్తుండగా.. గురుమూర్తి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నాడు.
![]() |
![]() |